"శ్రవణ మనన నిదిధ్యాసనములు బ్రహ్మజ్ఞాన సాధనములని బృహదారణ్యకోపనిషత్తులో ప్రకటించబడినది. "ఆత్మా వా అరే ద్రష్టవ్య ". దాని ప్రాప్తికి "శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య" శ్రవణ , మనన, నిదిధ్యాననములు విధించబడినవి . శ్రవణమనగా ఆలకించటము. గురుముఖంగా విని వేదాంత శాస్త్ర బోధ ద్వారా అద్వితీయ పరబ్రహ్మముందని తెలుసుకొని శాస్త్ర తాత్పర్యమును గ్రహించుటకు చేయు మానస క్రియ. ఈ సాధానాంశము అజ్ఞానమును తొలగించుటకు నిర్దేశింపబడినది. మననమనగా ఆలోచించటము. శాస్త్ర బోధనవలన ఏర్పడిన జ్ఞాన విషయాన్నీ హేతు ,దృష్టాంతాలతో పరిశీలించి శాస్త్ర తాత్పర్యాన్ని స్థిరీకరించుకొనుటకు చేసే మానస క్రియ. నిదిధ్యాసనమనగా ఇంద్రియ నిగ్రహముతో చిత్తమును విషయవాంఛల పైకి పోనీయకుండా ఏకాగ్రతను సాధించుటకు చేసే మానస క్రియ .