Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
అర్ధ శతాబ్దం పై చిలుకు లౌకిక జీవనంలో మునిగి తేలిన శ్రీవెంకటేశ్వర్లుగారిని భగవాన్ శ్రీరామకృష్ణులు హఠాత్తుగా తమ వైపు ఆకర్షించుకొన్నారు, అంతే! శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో ఆయన లౌకిక, కుటుంబ బంధాల నుంచీ విముక్తి పొంది, పారమార్థిక జీవితానికి శ్రీకారం చుట్టారు. జప ధ్యానాలతో కాలం గడుపుతూ క్రమంగా భగవాన్ రామకృష్ణుల కృప వలన ఆధ్యాత్మిక గ్రంథ రచనకు ఉద్యమించారు. ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర్లుగారి శ్రీరామకృష్ణ కథామృతం, శ్రీ శంకర విజయం, భగవద్గీతాసారం, శ్రీమద్రామాయణం, శ్రీరామావతారతత్త్వం గ్రంథాలు ప్రచురితమై ప్రజాదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం త్వరలో వీరి శ్రీకృష్ణావతార తత్త్వం, శ్రీమద్మహా భారతము పూర్తి వచనంలో ముద్రణకు నోచుకోబోతున్నాయి. భగవాన్ శ్రీరామకృష్ణులే తనలో ఈ రచనా పాటవాన్ని సైతం సృజించారని శ్రీ వెంకటేశ్వర్లుగారి ప్రగాఢ విశ్వాసం.
తన కుటుంబం కన్నా సమాజం అన్ని విధాలా పెద్దదని, ఉత్కృష్టమైనదని శ్రీ వెంకటేశ్వర్లుగారు స్వానుభవంలో గ్రహించారు. తత్ఫలితంగా కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకొని, భగవాన్ శ్రీరామకృష్ణుల ఆదేశంగా ఎంచి సమాజ సేవకు ఉపక్రమించారు. సాటి వారి కష్టాలలో పాలుపంచుకుంటూ ఉడతా భక్తిగా వారికి చేదోడు వాదోడుగా ఉండడం వీరి స్వభావం. ఇప్పటికే విజయవాడ రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్య, వసతి తదితర సదుపాయాలను ఉచితంగా అందజేయడానికి తమ పెంపుడు తల్లి 'చిలుకూరు శ్యామలాంబ'జ్ఞాపకార్థం భారీ విరాళంతో Student's Home ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత సమాజంలో మానవీయ, నైతిక విలువలు పునరుద్ధరించడానికి తన వంతు ఉడతా భక్తిగా నిస్స్వార్థ సేవకు పూనుకున్నారు. అంటే చిన్నతనంలోనే విద్యార్థుల్లో నైతిక, మానవీయ విలువలను పాదుగొల్పడమే ఈ సమాజ వికాసం' లక్ష్యం.
బాలబాలికలలో ఈ విలువలను పాదుగొల్పడానికి ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో కృషిచేస్తున్న సేవాసంస్థలకు నీతిశతకాలు, భగవద్గీత వంటి ధార్మిక బోధనలు గల పుస్తకాలను ఉచితంగా అందించడమే సముచిత మార్గం అని శ్రీ వెంకటేశ్వర్లుగారి విశ్వాసం. ప్రస్తుతం ఆయన ఆ బృహత్పథక రచన, కార్యాచరణలలో నిమగ్నులై ఉన్నారు.