Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పద్మభూషణ్, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (18951971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్ఠవపద్య శిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు.
మూడు భాగాలుగా వెలువరించిన 'నా కథ' (1962) ప్రధానంగా ఆత్మకథ లాంటిది. కాని అందులో ఎక్కువగా జీవితవివరాలు, సంఘటనలే కనిపిస్తాయి. తక్కిన కావ్యాల్లోని దర్శనం, లోతులు ఈ పద్యాల్లో కనిపించవు. మొత్తం మీద కనిపించేది ప్రధానంగా అసంతృప్తి.
ఈదితి వాజ్మయాంబుధి నేబదియేడులు సర్వపండితా
మోదముగా రచించితివి ముప్పది కావ్యములిట్టినీవు ని
ర్వేదము కల్గు, ధిఃకృతి లభించెడు దేశములోన నీకు మా
కేది శరణ్యమంచు తలయెత్తక చింతిలె కావ్యకామినుల్ - అంటాడు జాషువ.
జాతీయస్థాయిలో ఎన్నో గౌరవాలు అందుకున్న అసంఖ్యాక ప్రజానీకపు అభిమానాన్ని చూరగొన్న జాషువాలో చివరివరకూ తన కవితాకన్యలను అనాధరించిన వారిపట్ల ఒక నిరసన భావం కొనసాగుతూనే వచ్చింది. అది ఆయనకు హృదయశల్యంగా మిగిలిపోయింది. నాకథ అంతటా ఈ బాధ దర్శనమిస్తుంది.