Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
'మాకొద్దీ తెల్లదొరతనము' అనే పాటను తెలుగువారెవరూ మరిచిపోయుండరనే నా నమ్మకం. ఎందుకంటే స్వాతంత్రోద్యమ సమయంలో తెలుగు జాతి నాలుకల మీద ఆడిన పాట అది. వారిని ఎంతగానో చైతన్యపరచిన పాట అది. ఆ రోజుల్లో ఆ పాటని సైక్లోస్టెల్ చేసి అణాకి అమ్మేవారు. అలా ఎన్ని సార్లు సైక్లోసెల్ చేయబడిందో లెకు లేదు. రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ గారికి ఆ పాట రాసినందుకు అప్పటి గోదావరి కలెక్టర్ బ్రేకన్ ఒక సంవత్సరం కఠిన కారాగారవాస శిక్ష విధించారు. ఈ విషయం చెప్పినపుడు గాంధీజీ మొదట నమ్మలేదట. ఆ తరువాత మిగిలిన వారినందరినీ కూడా ఆ విధంగా పాటలు రాయమని ఆదేశించారట. గరిమెళ్ళ రాసిన దేశభక్తి గీతాలను 1921 లో 'స్వరాజ్య గీతములు' పేరుతో రెండు భాగాలుగా 'ఇండియా ఏజంసి బీరో' ప్రచురించింది. బ్రిటిషు ప్రభుత్వం ఆ పుస్తకాలను నిషేధిస్తూ రచయితకి మరోసారి కారాగార శిక్ష విధించింది. రెండు కేసుల్లోనూ కలిపి ఆయన రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
" ... నా గళాన్ని, కలాన్ని ఒక ఏడాదిపాటు జోకొడదామని బ్రిటిష్ నిరంకుశ పాలకవర్గం నిర్ణయించింది. పౌర జీవిత ప్రశాంతికి, అంటే తన మనుగడకే ప్రమాదకారినని భావించింది. ఇది నాకే కనువిప్పు...” తన పుస్తకాల గురించి "నా గ్రంథము 5000 ప్రతులను నా పాదముల కడ ప్రోగు పెట్టినపుడు నాకు గర్వమును, దుఃఖమును కూడ వెంటనే కలిగెను. ఆ యమర శిశువులు మరణభీతిచే నన్ను కాపాడమని నా వంక దయాదృష్టుల నిగుడించెను. ... నేను కేవల మసమర్థుడను గదా.” (జైలుకు వెళ్లేముందు ఆయన ఇచ్చిన ప్రకటన నుండి; ఆంధ్రపత్రిక, 28 జూలై 1922),