Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కేరళ ప్రాచీన చరిత్రగల దేశం. ఆ దేషభాష మలయాళం ప్రత్యేకభాషగా విడివడినది మాత్రం దాదాపు వేయేండ్ల క్రిందట, మలయాళం ద్రావిడభాషా కుటుంబంలోది. తమిళం, తెలుగు, కన్నడం ఈ కుటుంబంలోని యితర ముఖ్య భాషలు. మలయాళం తమిళానికి సన్నిహితభాష. ద్రావిడ భాషా మూలకమే అయినా, ప్రత్యేక భాషగా రూపొందే దశలో సంస్కృత సాహిత్య సంప్రదాయ ప్రభావం మలయాళ భాషకి విశేషంగా పుష్టి కూర్చింది.
ఇతర భారతీయ భాష లన్నింటిలాగే మలయాళంకూడా పందొమ్మిదవ శతాబ్దిలోనే ఆధునిక రూపరేఖలు దిద్దుకొన్నది. నాటినించి సాహిత్య వ్యాసంగంలోను నూతన సాహిత్య రీతుల్ని అలవరచుకోటంలోను ప్రశంస్య కృషి జరిగింది. ఆధునిక యువ రచయితలు శక్తిమంతములగు రచనలు చేస్తున్నారు. అలాంటి రచయితల్లో గుణంలోను, గణంలోను కూడా అగ్రగణ్యుడు తగళి శివశంకరపిళై.
తగళి జననం 1914 ఏప్రిల్ లో, జన్మస్థానం కేరళ రాష్ట్రంలో ఆలెప్పీకి పదిమైళ్ళలో వున్న చిన్న గ్రామం. దక్షిణ భారతదేశంలో చాలమంది ప్రముఖ రచయితలు, కవులు, గాయకులు వారి గ్రామనామాలతో సుప్రసిద్ధులవటం పరిపాటి, అలాగే శివశంకరపిళ్ళె జన్మస్థానం 'తగళి' ఆయన ప్రసిద్ధనామం అయింది. తగళి తండ్రి వృత్తిరీత్యా కర్షకుడు, పెద్దమనిషి, పండితుడు, ప్రఖ్యాత కేరళ నృత్య నాటక సంప్రదాయం 'కథకళి' ని ప్రోత్సహించిన కళాభిమాని. నేటి కథకళి నటులలో అద్వితీయుడు శ్రీ కుంజు కురుప్ ఈయన సోదరుడవటం వల్ల ఇందులో ఆశ్చర్యమేమీలేదు. సంస్కృత సంస్కృతికి, కేరళ ప్రాంతీయ కళలకి ఆటపట్టయిన వంశం వారిది. కుటుంబం పెద్ద సంజెవేళ తైలదీపం ప్రక్కన కూచుని, కేరళలో బహు సద్వంశాలలో అనూచానంగా వస్తున్న ఆచారం ప్రకారం రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవాడు. తండ్రి చదివే పురాణ కథలు ఆసక్తితో ఆలకించేవాడు బాల తగళి.