Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                          'ఋణం' ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి 11వ కథల సంపుటి. ఇందులో 19 కథలున్నాయి. అన్నీ మానవత్వ పరిమళాలతో గుబాళించినవే. పనిమనిషి కూతురు 'హాసిని'కి విద్యాబుద్ధులు చెప్పించి, ఆదర్శభావాలుగల యువకుడితో వివాహం జరిపిస్తుంది ప్రియంవద. అనుకోని పరిస్థితుల్లో ప్రియంవద టీచరు కుమార్తె కోసం అద్దె గర్భం ధరించి, పండంటి మగపిల్లాడిని ప్రసవించి గురువు ఋణం తీర్చు కుంటుంది హాసిని. కానీ పిల్లవాడిని వారి కప్పగించేటప్పుడు హాసిని మాతృహృదయం పడిన క్షోభ పాఠకుడ్ని కంటతడి పెట్టిస్తుంది. పేగుబంధం గొప్పతనాన్ని హృద్యంగా తెలిపిన కథ "పేగుబంధం”.

                          పెళ్ళిళ్ళల్లో, శుభకార్యాలలో బంధువులతో పాటు సమాన గౌరవాలు పొందిన అత్తరు సాయిబులు, కాలగమనంలో వచ్చిన మార్పులతో చితికిపోయి అగరుబత్తీలమ్మేవారిగా మారి సాగిస్తున్న జీవన పోరాటాన్ని కళ్ళెదుట రమ్యంగా సాక్షాత్కరింపచేసిన కథ 'పరిమళం'. సైకిల్ పై ఊరూరా తిరుగుతూ అగరుబత్తీలమ్మే జబ్బార్ పల్లె ప్రజలతో మమేకమై జీవిస్తూ వారిచేత 'సాయిబన్నా' అని పిలిపించుకుంటూ ఆనందంగా జీవిస్తుంటాడు.

                           రామశర్మది, జబ్బార్ ది రామాంజనేయ మైత్రి. ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేరు. వృద్ధాప్యం వచ్చాకా కొడుకు రాజమండ్రి వచ్చి తనదగ్గర ఉండమన్నా, శివపురం వదిలి రాలేనని చెప్పిన జబ్బార్, శివపురం రామాలయం ముందు అగరుబత్తీలు అమ్ముతూ ఆఖరి శ్వాస వదులుతాడు. జబ్బార్ చివరిసారిగా చూసేందుకు వచ్చిన వేలాది పల్లె ప్రజలను చూసి ఆశ్చర్యపోతాడు జబ్బార్ కొడుకు. తండ్రిపట్ల వారికున్న ఆత్మీయతకు చలించిపోతాడు.