శ్రీమతి పత్తి సుమతి గారి ఈ చిన్ని పుస్తకము “సింగిల్ చైల్డ్ సిండ్రోమ్" చిన్ని చిన్ని కథలతో, చక్కని వ్యవహారిక శైలితో చూడగానే చదవాలనిపిస్తుంది. కానీ చదివిన తర్వాత చాలా ఆలోచింపజేస్తుంది. నేడు టెక్నాలజీ పరంగా ఎంతో ప్రగతి సాధించినా కూడా మనుషులు వారి వారి కుల, మాట, జాతి, తెగల నమ్మకాలు, ఆచారాలపరంగా చాలా వెనకబడి ఉన్నారనే వాస్తవం కొంత మనసును మెలిపెడుతుంది. అక్షర జ్ఞానం లేని అనాగరిక పెద్దల మాటలు, పూజలు, బలులు, గణాచారి హెచ్చరికలు మొదలైనవి ఎన్నో ఎంతో ప్రభావవంతంగా ఎప్పటికీ మనిషి మనసును కీలుబొమ్మలా ఆదిస్తున్నవనేది జగమెరిగిన సత్యం. మనిషి ఎంత చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా తమ రక్తంలో జీర్ణంచుకున్న గుడ్డి నమ్మకాలను, భయాలను పారద్రోలే విషయం లో విఫలమవుతున్నాడు.
ఈ విషయాలను రచయిత్రి పత్తి సుమతి గారు తన జీవితంలో కళ్లారా చూచిన, విశ్వసనీయంగా తెలిసిన యదార్థ సంఘటనలకు అక్షర రూపం ఇచ్చి, కథలుగా మలిచి, చక్కని ప్రాంతీయ భాషకు పట్టంగట్టి, విజ్ఞాన విశేషాలను పొందుపరచి, మూఢ నమ్మకాలు, మూర్ఖపు ఆలోచనలు, యోగ్యత నెరుగ నిరాకరించే అత్యాశలు, మేనరికపు సంబంధాల వల్ల కలిగే సంతానంలో జన్యు సంబంధ వికృత పరిణామాలు మొదలైనవన్నీ చాలా సున్నితంగా, ఒకచో వ్యంగ్యంగా ఆలోచింపజేసే విధంగా మలచిన తీరు కడు ప్రశంసనీయం .
"హతోస్మి" కథలో వరుస మేనరికపు వివాహాలతో, జన్యులోపంతో పిల్లలు కలగక పోవడం అమ్మోరి శాపమని, దయ్యాలు పిండాలను తినడమే కారణమని, ధనాభావం వల్ల తగిన శాంతులు చేయలేక పోవడమని నమ్మే మడేలు దంపతులకు అసలు విషయం ఇది అని ఎవరు అర్థమయ్యేలా చెబుతారు.