Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
తెలుగు కథానిక - 2020లో స్థానం పొందిన కథా రచయితలు, రచయిత్రు లందరకూ శుభాభినందనలు. ఈ కథానికా సంకలనాన్ని ప్రసిద్ధ రచయిత్రి డాక్టర్ సి.ఆనందారామం దివ్యస్మృతికి అంకితం ఇస్తున్నాము.
ఇందులో చాలా మంచి కథలున్నాయి. సమాజంలో జరిగే అవినీతిని ప్రశ్నించడమే లేకుండా, దాని నిర్మూలనకు, పరిష్కారానికి ధైర్యంగా ముందుకురికిన మాలతి మనకు సూరి. గురుదక్షిణగా 'అద్దెగర్భం' ధరించి మరో కుటుంబంలో నవవసంతం చిగురింప చేసిన హాసిని మాతృ హృదయానికి పాఠకులు స్పందించకమానరు. అవార్డుల లక్ష్యం కాదు, మానవత్వం ముఖ్యమని భర్తకు గీతోపదేశం చేసిన 'మంగళ' మరో గొప్ప మహిళ. అనుకోని పరిస్థితుల్లో తల్లికి దూరమైన నెలల బిడ్డకు కష్టకాలంలో తన బిడ్డతోపాటు, ఆ బిడ్డకు పాలిచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడిన మహోన్నత మాతృమూర్తి, బడుగుజీవుల ప్రతినిధి సీతాలు. పక్క అపార్ట్ మెంట్ వాచ్ మెన్ బాబు ఏడుస్తుంటే, భర్తని నిద్రలేపి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ కడుపునొప్పి తగ్గడానికి మందు ఇచ్చివచ్చిన మానవతామూర్తి విమల. తనని నిత్యం చీదరించుకుంటూ, దుర్భాషలాడినా ఆవ్యక్తి అనారోగ్యంతో రోడ్డుమీద స్పృహ తప్పిపోతే, మానవత్వంతో అతన్ని హాస్పటల్ లో చేర్చి ప్రాణదానం చేసిన కొండయ్య. ఇలా ఎంతోమంది ఈ కథానికల్లో కనిపించి మనల్ని కదలిస్తారు. కరోనా కష్టకాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందిన 'కాఫీ పెట్టవూ' కథానిక కూడా ఇందులో ఉంది.
మా రమ్యసాహితీ తరపున ఇంతవరకు 22 పుస్తకాలు ప్రచురించాము. ఇందులో ప్రధానమైనవి పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర (525 పేజీలు), 124 మంది రచయితల కథలు కథా పారిజాతాలు (925 పేజీలు), 54 కథలతో తెలుగు కథా మందారాలు (324 పేజీలు). -
2014 నుండి తెలుగు కథానిక సిరీస్ ప్రచురిస్తున్నాము. ఈ కథా సంకలనానికి చక్కని ముఖచిత్రాన్ని అందించి, కథలను డి.టి.పి.చేసిన మిత్రులు శ్రీ ఎస్.డి. మిరాషరీఫ్ గార్కినా ధన్యవాదాలు.
మీ ఎమ్.ఆర్.వి. సత్యనారాయణమూర్తి
అధ్యక్షులు, రమ్య సాహితీ సమితి